CM KCR: ముగిసిన ఢిల్లీ టూర్.. హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్
KCR Focused on National Politics: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ముఖ్యమంత్రి కొద్ది సేపటి క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఐదు రోజులగా ఢిల్లీలో ఉన్న సీఎం జాతీయ రాజకీయాలపై పలువురు రాజకీయ నేతలతో సమావేశాలు నిర్వహించారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో భేటీ అయిన కేసీఆర్ బీజేపీ పాలిత ప్రాంతాల్లోని తాజా రాజకీయాలపై చర్చిచారు. రానున్న ఎన్నికల్లో విపక్ష పార్టీలు వ్యవహరించబోయే అంశాలపై చర్చించారు.
దీంతోపాటు దేశంలో ప్రాంతీయ పార్టీలను, ఆ ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నార్థకం చేసే ధోరణితో కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీన్ని సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక ఆంక్షలు విధించి, వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించడాన్ని, ప్రభుత్వంలో చిచ్చుపెట్టి చీలికలు తేవడం ద్వారా ప్రాంతీయ పార్టీల ఉనికిని గందరగోళంలో పడేసే విధానాలను.. పార్లమెంట్ లోపలా, బయటా ఎండగట్టాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం.